30, ఆగస్టు 2011, మంగళవారం

పరంజ్యోతి

కర్మ అంటే ఏంటి?

కర్మఫలం అంటే ఏమిటి? 

జన్మలు ఉంటాయా?

మరణించిన మనిషి మళ్లీ బ్రతుకుతాడా?


ఈ ప్రశ్నలన్నిటికీ  సమాధానం చెప్పే  మల్లాది గారి అద్భుత ఆధ్యాత్మిక నవల......'పరంజ్యోతి'

మొన్న మా బజ్జు గుంపులో దయ్యాల మీద,పునర్జన్మల మీద,ఊజాబోర్డు గురించి,మల్లాది గారు వ్రాసిన 'అనగనగా ఒక అతిధి'నవల గురించి ఒక  సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు నేను చదివిన ఈ నవల గుర్తొచ్చి అది ఈ బ్లాగు పోస్టుకి నాంది పలికింది :)

ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో చూడగానే....'హబ్బా ఇంకో బోరింగ్ నవల!' అనుకున్నా! కాని మా అమ్మ 'ఒకసారి చదువు నీకే తెలుస్తుంది.....బోరింగో..ఇంటరెస్టింగో'....అంటే సరేలెమ్మని చదవడం ప్రారంభించా!

ముందు నాలుగైదు పేజీలు  కొంచెం విసుగనిపించినా రానురాను కథలో చిక్కదనం ఎక్కువైంది. ఒక వ్యసనపరుడు సాధువుగా ఎలా మారాడు? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాడు అన్నది ఈ నర్మదా-గోదావరి నదుల ఒడ్డున సాగే కథ!

రెండు శతాబ్దాల క్రిందట గోదారి తీరంలో వెలసిన 'నెమలి కొండ' సంస్థానం రాజు 'విజయ రామరాజు'  కథ ఇది. వ్యసనపరుడైన రామరాజు  రాజ్యాన్ని,రాణిని ఆఖరికి కన్న కొడుకుని కూడా లక్ష్యపెట్టకుండా  భోగలాలసలో మునిగి తేలుతుంటాడు. అతన్ని మార్చాలని అతని భార్యతో సహా బంధువులందరూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. చివరికి అతని వ్యసనాలు మందులేని రోగం రూపంలో అతన్ని మంచాన పడేస్తాయి. అయినప్పటికీ అతనిలో మార్పు ఉండదు. ఇదంతా చూసి విరక్తి చెందిన రామరాజు భార్య,బావమరిది కలిసి విషం పెట్టి అతన్ని చంపేస్తారు.

రామరాజు రోగం వల్లే చనిపోయాడనుకుని భావించిన అందరూ గోదావరి తీరాన అతని దేహానికి దహన సంస్కారాలు చేయడానికి  ఏర్పాట్లు చేస్తారు. చితికి నిప్పు పెట్టాక....ఉన్నట్టుండి పెద్ద వర్షం.....దానితోపాటే గోదారి పొంగిపొరలి కొద్దిగా కాలిన  చితిని కొట్టుకుపోయేలా చేస్తాయి. కళ్ళముందే రామరాజు చితి వరదగోదారిలో కొట్టుకుపోతుంటే చేసేది లేక మిన్నుకుండిపోతారు రాజ కుటుంబీకులు. ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు!

కాని కొద్దిరోజుల తరువాత 'రామరాజు' సగం కాలిన దేహాన్ని ఎవరో సాధువు కాపాడారని.....రామరాజుకి తిరిగి ప్రాణం పోశారని అతని పేరు 'పరంజ్యోతి' అని తెలుస్తుంది! ఇది నిజమేనా? ప్రాణం తిరిగి వచ్చిన రామరాజు ఏమయ్యాడు? రాజ్యానికి చేరాడా లేదా? అసలు ఇంతకీ  'రామరాజు' 'పరంజ్యోతి' ఒకరేనా? ఒకవేళ పరంజ్యోతే రామరాజు ఐతే  తనని చంపినవారెవరో తెలుసా?...... ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరకి సమాధానాలు కావాలా? అబ్బా.....ఆశ,దోశ,అప్పడం.... నేను చెప్పనుగా!! మరి ఎలా?  అందుకే మంచిపిల్లల్లా ఈ పుస్తకం చదవాలి మరి ;)

అసలే అమ్మమ్మ చనిపోయి దుఃఖంలో ఉన్న నాకు ఈ నవల ఊరటనిచ్చింది. 'కర్మ' అంటే ఏమిటో చెప్పకుండానే చెప్పిన మల్లాది గారి శైలి అద్భుతం. ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సరాసరి చెప్పేస్తే బుర్రలోకి ఎక్కదు. అదే చిన్న కథ రూపంలో చెబితే మనసులో నాటుకుపోతుంది. ఈ నవల కూడా ఆ కోవకే వస్తుంది. ఎన్నో ధార్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు,నిత్యం ప్రతి మనిషి పాటించవలసిన సూత్రాలు....ఇలా ఎన్నో 'పరంజ్యోతి' అనే పాత్రని అడ్డుపెట్టుకుని మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. పంతొమ్మిదోశతాబ్దంలో  బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు :)

సాధారణ పాఠకులకి ఈ నవల కొంచెం బోర్ గా అనిపించవచ్చు! కాని దైవ చింతన,ఆధ్యాత్మిక జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన అనే విషయాల మీద ఆసక్తి ఉన్నవారు.........జన్మలు,కర్మ సిద్దంతాలు మీద నమ్మకం ఉన్నవారు చక్కగా చదువుకోవచ్చు. ఇవన్ని లేకపోయినా......కనీసం తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నా ఒక్కసారి ఈ నవల చదివితే జీవితం మీద మీ దృక్పధం మారిపోతుంది అన్నది మాత్రం ఖచ్చితం :)

నాకు ఈ నవల ఎంత నచ్చిందంటే...........దీనిలో నాకు నచ్చిన చాలా విషయాలని నేను విడిగా నోట్ చేసుకున్నా... ఎప్పటికి మర్చిపోకూడదని :)

 ఈ నవల చదవడం కూడా నా కర్మఫలమేనేమో!  :)

11 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

>>> పంతొమ్మిదోశతాబ్దంలో బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు.

నిజం గా చనిపోయిన మనిషి బతికాడంటే నమ్మబుద్ధి కావటం లేదండీ.

నవల కి వస్తే ఒక సంస్థానానికి రాజు, దహన సంస్కారాలు చేస్తుండగా వర్షం, గోదావరికి వరద, చితి కొట్టుకు పోవడం, సగం కాలిన శవాన్ని బతికించడం. అసలు నమ్మలేను.
మీరు చెప్పినట్టు నవల అద్భుతం గానే వ్రాసి ఉండవచ్చు. వీలైతే చదువుతాను.

స్నిగ్ధ చెప్పారు...

వావ్ ఇందు,మంచి నవలని పరిచయం చేసారు...మా లైబ్రరీ లో ఉందేమో కనుక్కుంటా...మా లైబ్రరీ లో నేను చదవాలనుకున్నవి పెట్టి చావరు...:(...ఈ ఉద్యాన నగరి తెలుగు పుస్తకాలు దొరికే షాపు కోసం వెతుకుతున్నాను..పెద్ద లిస్ట్ ఉంది చదవడానికి...

oremuna చెప్పారు...

కినిగెలో ఈ పుస్తకం ఉంది పరంజ్యోతి - మల్లాది వేంకట కృష్ణ మూర్తి

కొత్తావకాయ చెప్పారు...

చక్కగా పరిచయం చేసారు, ఇందుగారూ. అభినందనలు.

తృష్ణ చెప్పారు...

ఆ మధ్యన మా మరదలి దగ్గర అనుకుంటా ఈ పుస్తకం చూశాను. అయితే చదవాలన్నమాట. good intro..!

శశి కళ చెప్పారు...

యెమి అయింది.అన్దరు మల్లాది వెంటాదుతున్నారు.
ఆయన అన్తు తెల్చాలనా?నాకెమొ నువ్వు వ్రాసింది
బొల్డు నచ్చింది.పిన లింకు లొ చూస్తా దొరుకుతున్దెమొ

జయ చెప్పారు...

ఇందు గారు బాగుందండి మీ పరిచయం. ఎప్పుడో ఒక సారి నేను కూడా ఈ బుక్ తలచుకున్నాను. నాక్కూడా, ఎందుకో బాగనిపించింది. ఇది నిజంగా జరిగిన కథే అని కూడా చెప్పారు.
http://manasvi-jaya.blogspot.com/2010/07/blog-post_27.html

ramki చెప్పారు...

nenu novels chadavanu indu garu.....
but i hope its a good novel.

ఇందు చెప్పారు...

@ బులుసు సుబ్రహ్మణ్యం: అవునండీ. కాని మన ఆలోచనాశక్తి అతీతమైనవి చాలా ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో! అందూకనీ అన్నీ నిజం కాకపోవచ్చని అనలేం కదా!

@ snigdha: హ్హహ్హ! దొరుకుతుందిలే స్నిగ్ధ! ఓపిగ్గా వెతికితే....కొద్దిరోజులకి దొరికేస్తుందిలే!

@oremuna: Thankyou!

ఇందు చెప్పారు...

@ కొత్తావకాయ: ధన్యవాదాలు కోవాగారూ!

@ తృష్ణ:అవునండీ ఒక్కసారి చదవండీ చాలాబాగుంటుంది :)

@ శశి కళ:హ్హహ్హ! లేదులే అంత సాహసం చేయంలే శశి ;)

ఇందు చెప్పారు...

@ జయ :అవునండీ ఆ పుస్తకం చివరలో వ్రాస్తారు నిజంగా జరిగిన కథే అని :)

@ RAMAKRISHNA VENTRAPRAGADA said...: ఏంపర్లేదు. ఎవరి ఇంటరెస్ట్ వారిది కదా! లైట్ :)