పుస్తక సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తక సమీక్ష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2011, మంగళవారం

పరంజ్యోతి

కర్మ అంటే ఏంటి?

కర్మఫలం అంటే ఏమిటి? 

జన్మలు ఉంటాయా?

మరణించిన మనిషి మళ్లీ బ్రతుకుతాడా?


ఈ ప్రశ్నలన్నిటికీ  సమాధానం చెప్పే  మల్లాది గారి అద్భుత ఆధ్యాత్మిక నవల......'పరంజ్యోతి'

మొన్న మా బజ్జు గుంపులో దయ్యాల మీద,పునర్జన్మల మీద,ఊజాబోర్డు గురించి,మల్లాది గారు వ్రాసిన 'అనగనగా ఒక అతిధి'నవల గురించి ఒక  సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు నేను చదివిన ఈ నవల గుర్తొచ్చి అది ఈ బ్లాగు పోస్టుకి నాంది పలికింది :)

ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో చూడగానే....'హబ్బా ఇంకో బోరింగ్ నవల!' అనుకున్నా! కాని మా అమ్మ 'ఒకసారి చదువు నీకే తెలుస్తుంది.....బోరింగో..ఇంటరెస్టింగో'....అంటే సరేలెమ్మని చదవడం ప్రారంభించా!

ముందు నాలుగైదు పేజీలు  కొంచెం విసుగనిపించినా రానురాను కథలో చిక్కదనం ఎక్కువైంది. ఒక వ్యసనపరుడు సాధువుగా ఎలా మారాడు? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాడు అన్నది ఈ నర్మదా-గోదావరి నదుల ఒడ్డున సాగే కథ!

రెండు శతాబ్దాల క్రిందట గోదారి తీరంలో వెలసిన 'నెమలి కొండ' సంస్థానం రాజు 'విజయ రామరాజు'  కథ ఇది. వ్యసనపరుడైన రామరాజు  రాజ్యాన్ని,రాణిని ఆఖరికి కన్న కొడుకుని కూడా లక్ష్యపెట్టకుండా  భోగలాలసలో మునిగి తేలుతుంటాడు. అతన్ని మార్చాలని అతని భార్యతో సహా బంధువులందరూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. చివరికి అతని వ్యసనాలు మందులేని రోగం రూపంలో అతన్ని మంచాన పడేస్తాయి. అయినప్పటికీ అతనిలో మార్పు ఉండదు. ఇదంతా చూసి విరక్తి చెందిన రామరాజు భార్య,బావమరిది కలిసి విషం పెట్టి అతన్ని చంపేస్తారు.

రామరాజు రోగం వల్లే చనిపోయాడనుకుని భావించిన అందరూ గోదావరి తీరాన అతని దేహానికి దహన సంస్కారాలు చేయడానికి  ఏర్పాట్లు చేస్తారు. చితికి నిప్పు పెట్టాక....ఉన్నట్టుండి పెద్ద వర్షం.....దానితోపాటే గోదారి పొంగిపొరలి కొద్దిగా కాలిన  చితిని కొట్టుకుపోయేలా చేస్తాయి. కళ్ళముందే రామరాజు చితి వరదగోదారిలో కొట్టుకుపోతుంటే చేసేది లేక మిన్నుకుండిపోతారు రాజ కుటుంబీకులు. ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు!

కాని కొద్దిరోజుల తరువాత 'రామరాజు' సగం కాలిన దేహాన్ని ఎవరో సాధువు కాపాడారని.....రామరాజుకి తిరిగి ప్రాణం పోశారని అతని పేరు 'పరంజ్యోతి' అని తెలుస్తుంది! ఇది నిజమేనా? ప్రాణం తిరిగి వచ్చిన రామరాజు ఏమయ్యాడు? రాజ్యానికి చేరాడా లేదా? అసలు ఇంతకీ  'రామరాజు' 'పరంజ్యోతి' ఒకరేనా? ఒకవేళ పరంజ్యోతే రామరాజు ఐతే  తనని చంపినవారెవరో తెలుసా?...... ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరకి సమాధానాలు కావాలా? అబ్బా.....ఆశ,దోశ,అప్పడం.... నేను చెప్పనుగా!! మరి ఎలా?  అందుకే మంచిపిల్లల్లా ఈ పుస్తకం చదవాలి మరి ;)

అసలే అమ్మమ్మ చనిపోయి దుఃఖంలో ఉన్న నాకు ఈ నవల ఊరటనిచ్చింది. 'కర్మ' అంటే ఏమిటో చెప్పకుండానే చెప్పిన మల్లాది గారి శైలి అద్భుతం. ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సరాసరి చెప్పేస్తే బుర్రలోకి ఎక్కదు. అదే చిన్న కథ రూపంలో చెబితే మనసులో నాటుకుపోతుంది. ఈ నవల కూడా ఆ కోవకే వస్తుంది. ఎన్నో ధార్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు,నిత్యం ప్రతి మనిషి పాటించవలసిన సూత్రాలు....ఇలా ఎన్నో 'పరంజ్యోతి' అనే పాత్రని అడ్డుపెట్టుకుని మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. పంతొమ్మిదోశతాబ్దంలో  బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు :)

సాధారణ పాఠకులకి ఈ నవల కొంచెం బోర్ గా అనిపించవచ్చు! కాని దైవ చింతన,ఆధ్యాత్మిక జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన అనే విషయాల మీద ఆసక్తి ఉన్నవారు.........జన్మలు,కర్మ సిద్దంతాలు మీద నమ్మకం ఉన్నవారు చక్కగా చదువుకోవచ్చు. ఇవన్ని లేకపోయినా......కనీసం తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నా ఒక్కసారి ఈ నవల చదివితే జీవితం మీద మీ దృక్పధం మారిపోతుంది అన్నది మాత్రం ఖచ్చితం :)

నాకు ఈ నవల ఎంత నచ్చిందంటే...........దీనిలో నాకు నచ్చిన చాలా విషయాలని నేను విడిగా నోట్ చేసుకున్నా... ఎప్పటికి మర్చిపోకూడదని :)

 ఈ నవల చదవడం కూడా నా కర్మఫలమేనేమో!  :)

16, సెప్టెంబర్ 2010, గురువారం

ది మిస్సింగ్ రోజ్



'ది మిస్సింగ్ రోజ్ '.....ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ లోపాన్ని సరిచేసి,ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేసే నవల....రచయిత 'సేర్దర్ ఒజ్కన్' మొదటి రచన అయినా....కథనం చక్కగా నడిపించాడు...అసలు విషయాన్ని పాఠం లా చెప్పకుండా కథ లో సమ్మిళితం చేసి చెప్పాడు.....  బ్రెజిల్ నుంచి టర్కీ కి వచ్చి మళ్లీ బ్రెజిల్ లో ముగిసే కథ ఈ 'మిస్సింగ్ రోజ్'......


విప్రో లో పుస్తకాల షాపు లో ఈ పుస్తకం కనబడితే శీర్షిక బాగుంది కథ ఏంటో అని వెనక్కి తిప్పి చదివా....'తన కవల సోదరిని వెతుకుతూ ఇస్తాంబుల్ వచ్చిన యువతి, గులాబిలతో మాట్లాడడానికి ఆహ్వానింపబడుతుంది' అని ఉంది. 'ఇదేదో భలే ఉందే....ఈ పుస్తకం చదివితే నాకు గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో...అప్పుడు ఎంచక్కా మా ఇంట్లో గులాబీలతో మాట్లాడుకోవచ్చు' అని కొనేసి....తీరిక వేళల్లో చదివేసా!!

ఇందులో నాయిక పేరు  'డయానా'...'రియో' లో ఉండే డయానా అందంగా ఉంటుంది.... నలుగురు నన్ను మెచ్చుకోవాలి అనే రీతిలో ఇతరుల మెప్పు కోసం బ్రతికేస్తుంటుంది....అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన 'రచయిత్రి' అవ్వాలనే కోరిక  వదులుకుని అందరూ గొప్ప అని పొగిడే 'లా' చదవాలని అనుకుంటుంది....కానీ తన కూతురు తాను అనుకున్న దారిలో నే వెళ్ళాలని, ఇలా ఇతరుల ప్రభావం వల్ల తన కల ని కల్ల గా చేసుకోకూడదని ఆమె తల్లి ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది....కానీ 'డయానా' వినదు....చివరికి మరణించేముందు తనకి ఇంకో కూతురు ఉందని,ఆమె అచ్చం డయానా లాగ ఉంటుందని,డయానా కంటే తెలివైంది బుద్ధిశాలి అని,ఆమె ని తన భర్త తీసుకేల్లిపోయాడని,ఆమెని ఎలాగైనా వెదికి తనకి మంచి జీవితం కల్పించాలని డయానాకి  చెబుతుంది...ఆమె గురించిన వివరాలు ఆమె పంపిన మూడు ఉత్తరాల్లో ఉంటాయని చెప్పి చనిపోతుంది....

తల్లి చనిపోయిన బాధ కన్నా తనకి కవల సోదరి ఉన్నది అన్న బాధ ఎక్కవైపోతుంది డయానా కి...అసలు ఆ అమ్మాయి ఇప్పటికే చనిపోయి ఉంటే బాగుండు అని కూడా అనుకుంటుంది...కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ ఉత్తరాలు చదివి ఆ అమ్మాయిని తీసుకురావాలని అనుకుంటుంది...అలా మొదటి రెండు ఉత్తరాల్లో ఉన్న  వివరాలతో ఆమె 'ఇస్తాంబుల్' లో ఉన్న ఒక వసతి గృహ యజమాని తోటలో గులాబి పూలతో మాట్లడేదని తెలుసుకుని నవ్వుకుంటుంది....సరే ఆమె వివరాలు ఆ వసతి గృహ యజమానికే తెలుస్తాయని అక్కడికి వెళుతుంది....ఎలాగో అలా కష్టపడి ఆ వసతి గృహాన్ని కనుగొంటుంది....అక్కడ ఉన్న దాని యజమాని డయానా ని చూసి 'మారియా'(కవల సోదరి పేరు) అనుకుంటుంది...కాదు అని తెలిసాక మారియ గొప్పదనం గురించి చెబుతుంది...ఇదంతా నచ్చని డయానా తన సోదరి ఎక్కడ ఉందో చెబితే తనని తీసుకుని 'రియో' వెళ్ళిపోతానని చెబుతుంది...'సరే నీ ఇష్టం కానీ కొద్ది రోజులు నా ఆతిద్యం స్వీకరించు' అని చెబుతుంది....అలా మెల్లగా డయానా ఆ యజమాని ఇంటి వెనుక ఉన్న గులాబీ పూల తోట,మాట్లాడే గులాబీల గురించి వాకబు చేస్తుంది....'ఎక్కడన్నా పూలు మాట్లాడతాయా ?? మరీ విడ్డూరం  కాకపొతే!!' అని  ఆ మాట్లాడే విద్య నేర్పించమని యజమానిని వెటకారంగా అడుగుతుంది.ఆమె భావం గ్రహించిన యజమాని...'గులాబీలు మాట్లాడతాయి అని ధృడ విశ్వాసంతో నేర్చుకుంటేనే ఈ విద్య నీకు అబ్బుతుంది....లేదంటే ఈ జన్మకి నీవు గులాబీలతో మాట్లాడలేవు.ముందు అందుకు సిధ్ధపడు' అని హెచ్చరిస్తుంది. కానీ అసలు ఈ వ్యవహారం అంతు చూద్దాం అనే ఉద్దేశం తో 'నేను నేర్చుకోవడానికి సిద్ధం' అని అంటుంది డయానా.


గులాబీలతో మాట్లాడే విద్య నేర్చుకోవడానికి ముందు ఆ తోటలో ఉండే నియమనిబంధనలు అన్నీ వివరిస్తుంది యజమానురాలు.తరువాత కొన్ని  రోజుల కఠిన శిక్షణ లో భాగంగా రోజు పొద్దున్న,ఒక్కోసారి మధ్యానం,కొన్ని సార్లు అర్ధరాత్రి ఆ తోటలోకి వెళ్లి పూల యొక్క మనోభావాలు ఆ యజమానురాలి ద్వారా తెలుసుకుంటుంది  డయానా.ఆ పువ్వులు తనతో మాట్లాడుతున్నాయని యజమానురాలు చెప్పినపుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది....'నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను వాటితో??' అని ప్రశ్నిస్తుంది.....'అవి నీతో మాట్లాడతాయి అని నీకు నమ్మకం కుదిరిన రోజున వాటి తీయటి పిలుపు నీకు  వినిపిస్తుంది...కానీ అది నువ్వు నమ్మవు...ఎందుకంటే అందరూ చెప్పేది అదే కాబట్టి...నువ్వు ఇతరుల  కోసం బ్రతుకుతున్నావ్ కాబట్టి.....నీ జీవితం నీది..నీ నమ్మకాలూ అభిప్రాయలు నీవి...ఎవరికోసమో నువ్వు నీ జీవితాన్ని,నమ్మకాల్ని మార్చుకోవాల్సిన పని లేదు' అంటుంది. క్రమంగా డయానా లో మార్పు వస్తుంది.అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజు ఆ యజమానురాలు తనకి మరియా ఫోను చేసి 'రియో' వెళుతున్నానని చెప్పిందని చెబుతుంది. తన తల్లి మరణించిందని తెలిస్తే మారియా  చనిపోతుందేమోనని కంగారు పడి డయానా వెంటనే రియో కి వెళ్ళిపోతుంది.అప్పుడు నాటకీయ పరిస్తితుల్లో వాళ్ళ అమ్మ దాచిన మూడవ ఉత్తరం చదివి దాని అనుగుణంగా మరియా ఎవరో కనుక్కోడానికి ప్రయత్నిస్తుండగా నిజం బహిర్గతమౌతుంది.....


మారియ ఎవరూ?? డయానా మారియని ఎలా కనుక్కుంది?? తరువాత డయానా జీవితం లో సంభవించిన మార్పులేంటి  అన్నది పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే...!!


నేను ఈ పుస్తకం చదివాక ఒకటి తెలుసుకున్నా.....ఎవరో మెప్పు కోసం జీవిస్తూ ఉంటే ఎవరు సంతోషిస్తారో ఏమో  కానీ అందులో మన ఆనందం ఏమి ఉండదు....అది కూడా నటనే అవుతుంది.......ఇక అప్పుడు జీవితం అంతా నటించాల్సివస్తుంది....అదే మనకి నచ్చిన పని చేస్తే..కనీసం మనం అన్నా సంతోషిస్తాం :)....




కానీ ఇంతకీ నేను గులాబీలతో మాట్లాడే విద్య వస్తుందేమో అని ఆశ పడ్డా...ఒకటి అని చదివితే ఇంకోటి అయింది :D

7, ఆగస్టు 2010, శనివారం

అమెరికాలొ మరోసారి

మల్లాది గారు వ్రాసిన 'ట్రావెలాగ్'...
మొన్ననే చదవడం పూర్తయింది....ఈ పుస్తకం కొని సంవత్సరం అయింది....ఈ ఏడాది లో 4-5 పుస్తకాలు పూర్తి చేసి ఉంటా చదవడం...కాని ఎందుకో మరి ఇది ఇన్ని రోజులు పట్టింది...(పుస్తకం పెద్దదేమీ కాదు...అనాసక్తంగా కూడా ఏమి లేదు).... బహుశా అమెరికా వచ్చేవరకు చదువుతూనే ఉండాలని రాసిపెట్టుందేమో...
ఇక మల్లాది గారి రచనల గురించి తెలిసిందే...
సున్నితంగా...సునిశిత హాస్యం తో...ఎంతో విశ్లేషించి వ్రాస్తారు....
ఆ కోవ లోకే వస్తుంది ఈ పుస్తకం కూడా..


వారి అమ్మాయి చదివే విశ్వవిద్యాలయం లో జరిగే స్నాతకోత్సవానికి వెళ్ళిన  మల్లాది గారు అక్కడ గడిపిన ౩ నెలల ౩ రోజుల అనుభవాలని పొందికగా ఈ పుస్తకం లో ఆవిష్కరించారు....


అమెరికా విశేషాలు....అక్కడ జీవన విధానాలు....అక్కడ నివశిస్తున్న తెలుగు వారి సంగతులు ....అమెరికన్ల తీరు...  తను ఇదివరకు చూసిన అమెరికా కి ఇప్పటి అమెరికా కి సారూప్యత...ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ....విశేదీకరిస్తూ....వ్రాసిన చక్కని పుస్తకం ఈ 'అమెరికాలొ మరోసారి'...


ఈ పుస్తకం చదవడం వల్లేమో నాకు అమెరికా కి కొత్తగా వచ్చిన భావనే లేదు....అంతా ఇంతకుముందు  చూసినట్టు గానే ఉంది....అంతేకాక అమెరికా లో ఉండి  తెలుగు సంస్కృతీ ని కాపాడటం కోసం కృషి చేస్తోన్న  'కిరణ్ ప్రభ ','వంగూరి చిట్టెన్ రాజు' గార్ల వంటి ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం  కలిగింది...


ఈ పుస్తకం చివరలో మల్లాది గారు ఒక మాట వ్రాసారు....'భౌతిక సుఖాలకి అమెరికా...ఆధ్యాత్మిక ప్రగతికి ఇండియా ని మించినవి లేవు' అని..... నిజమే అనిపిస్తోంది....


చాల ఆహ్లాదంగా సాగిన మంచి 'ట్రావెలాగ్' ఈ 'అమెరికాలొ మరోసారి'.........