ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2011, గురువారం

మా ఇంటి గణపయ్య :)

ఉండ్రాళ్ళ మీదకి దండు పంపూ....గణపయ్యా....
కమ్మని నెయ్యి కడు ముద్దపప్పు గణపయ్యా....
ఓ బొజ్జ గణపయ్య...నీ బంటు నేనయ్యా...

ఈ పాట చిన్నప్పుడు ప్రతి వినాయకచవితికి పొద్దున్నే మా టేప్రికార్డర్లో మమ్మల్ని మేలుకొలిపేది :) ఇవాళ పొద్దున్నే నాలుగింటికి ఈ పాట నేనే పాడుకుంటు లేచి.... అన్ని నైవేద్యాలు చేసి.... గణపయ్యకి బోలెడు వండిపెట్టి... ఇంకా చక్కగా పూజ చేసుకుని అంతా అయ్యేసరికి పది :) అసలే వీక్ డే కదా... అంతా ఉరుకులు,పరుగులు లాగా అయిపోయింది :) 

ఇక అట్టే మీకు నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగించనులే... పిక్స్ పెట్టా..చూసి...తరించేయండి మా ఇంటి గణపయ్యని :) 

గణపయ్యకి ఇష్టమని..ఉండ్రాల్లు,మోదకాలు,గారెలు,పులిహోర,పాయసం చేసా :) వాటికి తోడు.... టమటా పప్పు, బెండ, దొండ కూరలు.. పులుసు.. ఇంకా వడపప్పు,పానకం :) ఇక మామిడి, చెరుకు, అరిటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష, పీర్స్, మొక్కజొన్న కూడా పెట్టాను. మరి సరిపోయాయో లేదో బుజ్జిగణపయ్య బుల్లి కడుపుకి :)


ఇంకా పూజ మొదలుపెట్టకముందు బియ్యప్పిండితో ముగ్గేసి...బియ్యంపోసి గణపతిని,వాళ్ళ డాడి శివయ్యని,మా ఇలవేల్పు వెంకీని, ఆయన భార్య లక్ష్మిని పెట్టాను :) 


మా గణపయ్య పూజకి ఎంతముచ్చటగా రెడి అయ్యాడో చూడండీ :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పుష్పం పూజయామి :) 


శ్ర్రీ మహాగణాధిపతయే...పత్రం పూజయామి :) 


కదళీఫల-నారికేళా సహిత నానావిధభక్ష్యభోజ్యం మహానైవేద్యం సమర్పయామి :) 


అంతే...పూజయిపోయిందోచ్! కథవిని అక్షతలు వేసుకుని...తోరం కట్టుకుని గణపతి ఆశీర్వాదం పొందండి :)

సరే...మరి...అందరికి ఇంకొక్కసారి 'వినాయకచవితీ శుభాకాంక్షలు :)


30, ఆగస్టు 2011, మంగళవారం

పరంజ్యోతి

కర్మ అంటే ఏంటి?

కర్మఫలం అంటే ఏమిటి? 

జన్మలు ఉంటాయా?

మరణించిన మనిషి మళ్లీ బ్రతుకుతాడా?


ఈ ప్రశ్నలన్నిటికీ  సమాధానం చెప్పే  మల్లాది గారి అద్భుత ఆధ్యాత్మిక నవల......'పరంజ్యోతి'

మొన్న మా బజ్జు గుంపులో దయ్యాల మీద,పునర్జన్మల మీద,ఊజాబోర్డు గురించి,మల్లాది గారు వ్రాసిన 'అనగనగా ఒక అతిధి'నవల గురించి ఒక  సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు నేను చదివిన ఈ నవల గుర్తొచ్చి అది ఈ బ్లాగు పోస్టుకి నాంది పలికింది :)

ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు ఈ పుస్తకం మా ఇంట్లో చూడగానే....'హబ్బా ఇంకో బోరింగ్ నవల!' అనుకున్నా! కాని మా అమ్మ 'ఒకసారి చదువు నీకే తెలుస్తుంది.....బోరింగో..ఇంటరెస్టింగో'....అంటే సరేలెమ్మని చదవడం ప్రారంభించా!

ముందు నాలుగైదు పేజీలు  కొంచెం విసుగనిపించినా రానురాను కథలో చిక్కదనం ఎక్కువైంది. ఒక వ్యసనపరుడు సాధువుగా ఎలా మారాడు? తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాడు అన్నది ఈ నర్మదా-గోదావరి నదుల ఒడ్డున సాగే కథ!

రెండు శతాబ్దాల క్రిందట గోదారి తీరంలో వెలసిన 'నెమలి కొండ' సంస్థానం రాజు 'విజయ రామరాజు'  కథ ఇది. వ్యసనపరుడైన రామరాజు  రాజ్యాన్ని,రాణిని ఆఖరికి కన్న కొడుకుని కూడా లక్ష్యపెట్టకుండా  భోగలాలసలో మునిగి తేలుతుంటాడు. అతన్ని మార్చాలని అతని భార్యతో సహా బంధువులందరూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. చివరికి అతని వ్యసనాలు మందులేని రోగం రూపంలో అతన్ని మంచాన పడేస్తాయి. అయినప్పటికీ అతనిలో మార్పు ఉండదు. ఇదంతా చూసి విరక్తి చెందిన రామరాజు భార్య,బావమరిది కలిసి విషం పెట్టి అతన్ని చంపేస్తారు.

రామరాజు రోగం వల్లే చనిపోయాడనుకుని భావించిన అందరూ గోదావరి తీరాన అతని దేహానికి దహన సంస్కారాలు చేయడానికి  ఏర్పాట్లు చేస్తారు. చితికి నిప్పు పెట్టాక....ఉన్నట్టుండి పెద్ద వర్షం.....దానితోపాటే గోదారి పొంగిపొరలి కొద్దిగా కాలిన  చితిని కొట్టుకుపోయేలా చేస్తాయి. కళ్ళముందే రామరాజు చితి వరదగోదారిలో కొట్టుకుపోతుంటే చేసేది లేక మిన్నుకుండిపోతారు రాజ కుటుంబీకులు. ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడతారు!

కాని కొద్దిరోజుల తరువాత 'రామరాజు' సగం కాలిన దేహాన్ని ఎవరో సాధువు కాపాడారని.....రామరాజుకి తిరిగి ప్రాణం పోశారని అతని పేరు 'పరంజ్యోతి' అని తెలుస్తుంది! ఇది నిజమేనా? ప్రాణం తిరిగి వచ్చిన రామరాజు ఏమయ్యాడు? రాజ్యానికి చేరాడా లేదా? అసలు ఇంతకీ  'రామరాజు' 'పరంజ్యోతి' ఒకరేనా? ఒకవేళ పరంజ్యోతే రామరాజు ఐతే  తనని చంపినవారెవరో తెలుసా?...... ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరకి సమాధానాలు కావాలా? అబ్బా.....ఆశ,దోశ,అప్పడం.... నేను చెప్పనుగా!! మరి ఎలా?  అందుకే మంచిపిల్లల్లా ఈ పుస్తకం చదవాలి మరి ;)

అసలే అమ్మమ్మ చనిపోయి దుఃఖంలో ఉన్న నాకు ఈ నవల ఊరటనిచ్చింది. 'కర్మ' అంటే ఏమిటో చెప్పకుండానే చెప్పిన మల్లాది గారి శైలి అద్భుతం. ఏదైనా మంచి విషయం చెప్పాలంటే సరాసరి చెప్పేస్తే బుర్రలోకి ఎక్కదు. అదే చిన్న కథ రూపంలో చెబితే మనసులో నాటుకుపోతుంది. ఈ నవల కూడా ఆ కోవకే వస్తుంది. ఎన్నో ధార్మిక రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు,నిత్యం ప్రతి మనిషి పాటించవలసిన సూత్రాలు....ఇలా ఎన్నో 'పరంజ్యోతి' అనే పాత్రని అడ్డుపెట్టుకుని మనకి చెప్పినట్లు అనిపిస్తుంది. పంతొమ్మిదోశతాబ్దంలో  బెంగాల్లో జరిగిన ఒక నిజజీవిత గాధ ఆధారంగా ఈ నవల వ్రాసారు మల్లాది గారు :)

సాధారణ పాఠకులకి ఈ నవల కొంచెం బోర్ గా అనిపించవచ్చు! కాని దైవ చింతన,ఆధ్యాత్మిక జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన అనే విషయాల మీద ఆసక్తి ఉన్నవారు.........జన్మలు,కర్మ సిద్దంతాలు మీద నమ్మకం ఉన్నవారు చక్కగా చదువుకోవచ్చు. ఇవన్ని లేకపోయినా......కనీసం తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకునే ఆసక్తి ఉన్నా ఒక్కసారి ఈ నవల చదివితే జీవితం మీద మీ దృక్పధం మారిపోతుంది అన్నది మాత్రం ఖచ్చితం :)

నాకు ఈ నవల ఎంత నచ్చిందంటే...........దీనిలో నాకు నచ్చిన చాలా విషయాలని నేను విడిగా నోట్ చేసుకున్నా... ఎప్పటికి మర్చిపోకూడదని :)

 ఈ నవల చదవడం కూడా నా కర్మఫలమేనేమో!  :)

21, ఆగస్టు 2011, ఆదివారం

ఒక బృందావనం!!

బృందావనం.......
ఆ పదమే ఒక పులకింత.....ఆ తలపే ఒక మైమరపు....
ఏ క్షణాన....ఆ సుందర లోకంలో అడుగుపెడతానా...అని నా తనువు నిలువెల్లా కనులై  ఎదురుచూస్తున్నది.....
'కృష్ణా!....మనసు ఎందుకో ఉత్తుంగతరంగమై ఎగసి....ఎగసి....నా మోమును సుతారంగా తాకివెల్లిపోతున్న ఆ  పిల్లతిమ్మెరల మీద సాగిపోతోన్న నీ మురళీగానాన్ని ఓడిసిపట్టుకోవాలని ఆత్రపడిపోతోంది!! ఎందుకో దానికి అంత తొందర? 
వచ్చేస్తున్నాను స్వామీ....నీ దివ్యమనోహర లోకానికి....
నీ మృదుపదస్పర్శతో పునీతమైన ఆ నందనవనంలో ప్రతి రేణువు నీ పాదరజమే కదా!
నీ రూపాన్ని నిండారా నింపుకున్న నీ సుధాధామంలో ఒక్క క్షణం నిలిచినా నా జన్మ ధన్యమవును కదా!'

ఈ ఆలోచనల్లో మునిగిపోతూ..... ఆ ఆనందలోకంలో తేలియాడుతుండగానే వచ్చేసింది 'బృందావనం'....నా కలలవనం...

నాతోపాటు వచ్చిన మిత్రబృందం అంతా తమతమ సామాన్లతో బస్సు దిగి...ముందు నడుస్తున్నారు.....
నేను మాత్రం....బస్సు దిగే ముందే....ఆ 'బృందావనం' అధిదేవత అయిన 'రాధారాణి'ని మనసులోనే అనుమతి అడిగి....నమస్కరించి....బస్సు దిగి పరమపవిత్రమైన ఆ మృత్తికని చేతితో స్పృశించి....శిరస్సున ధరించాను!
ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతి... నన్నునిలువనీయట్లేదు.....ఆ అనుభూతిలోనే మెల్లగా నడుస్తూ....నా నేస్తాలను అనుసరించాను!

చుట్టూ చూసాను! నా కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయ్! ఏదో చూడాలని ఆశపడుతున్నాయ్! ఏదో కనుగొనాలని ఆత్రపడుతున్నాయ్!! కానీ ఎక్కడ? 

మెల్లగా అలా ముందుకు సాగుతున్నాను.....ఎంతకీ ఆ నందనవనం కానరాదే??
ఇదేనా బృందావనం? అని ఎవరినైనా అడగాలనిపించింది. కానీ కళ్ళముందు ప్రత్యక్షంగా కనపడుతోంది.... మరి నా మనసేమో.... 'ఇది కాదు నేను చూడాలనుకున్న బృందావనం' అని గోలచేస్తోంది.ఇదేమి పట్టించుకోకుండా కెమెరాలతో కనపడినదల్లా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు నా మిత్రబృందం. వారివెంట జీవంలేనిదానిలాగా నడుస్తున్నాను నేను!

నా భుజాన వ్రేలాడుతున్న కృష్ణుడిముఖచిత్రం ఉన్న హాండ్ బాగ్....బరువుగా అనిపించింది. అందులో కృష్ణుడిమీద రాసిన వేలవేల పాటలు కలిగి ఉన్న పుస్తకం ఉంది. ఈ బృందావనంలో ఆ దేవదేవునికి అంకితం చేద్దామని తెచ్చి పెట్టుకున్న ఆ పుస్తకం.....దీనంగా నావంక చూస్తున్నట్టు అనిపిస్తోంది....

ఆ పుస్తకంలో ఐదువేల పాటలు రాయాలని నా సంకల్పం....ఇప్పటికీ 4999 రాసి....ఆ చివరి పాట ఈ బృందావన క్షేత్రంలో....ఈ సుమనోహర ప్రదేశాన్ని వీక్షిస్తూ....వ్రాసి....నా సంకల్పాన్ని నెరవేర్చి ఆ స్వామి పాదాలకి ఈ పాటలతోటని అంకితమివ్వాలని ఆశ పడ్డా!! కానీ ఏమని వ్రాయను?? ఎలా రాయగలను??? 

జయదేవుడు వర్ణించిన ఆ అద్భుత సౌందర్య అద్వితీయ సుందర నందనవనం ఇదేనా?
నా లీలామోహనుడు....ప్రతినిత్యం రాధాదేవితో రాసలీలలాడే రససామ్రాజ్యం ఇదేనా?
నా మురళీధరుడు తన సఖీసమూహంతో ఆటలాడిన వ్రజ భూమి ఇదేనా?
"మాధవికా....పరిమళ లలితే....నవ మాలతి జాతి సుగంధౌ!!" అని అన్నారే జయదేవులు....మరి ఎక్కడ ఆ మాధవీలతలు? ఎక్కడ ఆ మాలతిపుష్పగంధాలు?
"లలితలవంగలతా పరిశీలన...కోమలమలయసమీరే....మధుకరనికర కరమబ్బిత కోకిల...కూజిత కుంజ కుటీరే!" ఈ కీర్తనకి అర్ధం? ఏవి ఆ లతలతో అల్లుకున నికుంజాలు?? ఫల,పుష్పవృక్షాలతో అలరారే కుటీరాలు? కమ్మని కోయిలల కిలకిలా స్వరాలు?

నా కళ్ళవెంట నీటి తడి! ఎదలో ఏదో మూల అలజడి! ఎక్కడికక్కడ షాపులు..... రకరకాల వస్తువులు అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు..... వస్తువులు కొన్నా కొనకపోయినా కనీసం చూసినా ఖరీదు కట్టమని నిలదీసే వర్తకులు.... విపరీతమైన వానరసేన.....ఇరుకిరుకు సందులు..... పాతకాలంనాటి ఇళ్ళు... కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుడ్యాలు..... తోసుకుంటూ తిరిగే జనాలు..... అంతకంటే వేగంగా సంచరించే అపరిశుభ్ర గోగణం.... భక్తిభావం అసలు లేకుండా అంతా గోలగోలగా ఓహ్! ఇక నావల్ల  కాలేదు..... నాకు అస్సలు అడుగు ముందుకువేయబుద్ది కాలేదు.... ఇక ఏమీ చూడాలనిపించలేదు!! ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించగా.... అక్కడే ఒక షాపు దగ్గర కూలబడ్డాను! అప్రయత్నంగా నా కనురెప్పలు మూతపడ్డాయి..... మనసుమాత్రం కృష్ణనామజపంలో మునిగిపోయింది! అలా ఎంతసేపున్నానో తెలీదు....

క్రమంగా చీకటిపడిపోయింది.... లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు.... నా స్నేహితులు....మమ్మల్ని తీసుకొచ్చిన బస్సు....ఆ మనుషులు.........ఎవ్వరూ లేరు....

దిగ్గున లేచాను! వెనక్కి తిరిగాను....అంతే! మాటాలు రాక చేష్టలుడిగిపోయి మైనపుబోమ్మలా అలా చూస్తూ ఉండిపోయాను! నాకళ్ళను నేనే నమ్మలేకపోయాను!

ఇందాక చూసిన రోడ్ల స్థానే పచ్చటి తివాచి పరిచినట్టున్న నందనవనాలు..... ఇంతింతేసి పువ్వులతో విరగబూస్తున్నాయి...... అంతే కాదు..... ఎప్పుడు కనివిని ఎరుగని రకరకాల ఫలాలతో విరగగాసిన చెట్లు ఆ ఫలభారంతో కొంచెం ముందుకు వంగాయి కూడా! పెద్దపెద్ద చెట్లు.... వాటిని బలంగా అల్లుకుని ఒకచెట్టునించి ఇంకో చెట్టుకి బంధం వేస్తున్న లతలు.... ఆ లతల్ని ఆధారంగా చేసుకుని ఉయ్యాలలూగుతున్న అందమైన గోపికలు..... ఆకాశంలో నక్షత్రాలన్నీ గుదిగుచ్చి తారాతోరణం కట్టినట్టు అంతటా వెలుగుజిలుగులు.... ఎటూ చూసినా.... కన్నెపడుచులు.... నవ్వుతూ.... తుళ్ళుతూ.... ఆటలు ఆడుతూ... పాటలు పాడుతూ.... అబ్బ! ఆ పాటలు తేనెలతేటలులాగా ఎంత బాగున్నాయో.......అలా ఆ వింతలన్నీ అబ్బురంగా చూస్తూ ముందుకు సాగాను!

రకరకాల పక్షుల కిలకిలారావాలతో,కమ్మని పూల పరిమళాలతో ఆ దారంతా ఆహ్లాదంగా ఉంది! కాళ్ళకింద ఆ పూలపుప్పొడి జారిపడి సుతిమెత్తగా తగులుతోంది.... చల్లని మలయమారుతం నా శ్వాసలో మమేకమౌతోంది..... ఆ పువ్వులని... ఆ ఆకులను చేతులతో తాకుతుంటే  ఏదో పులకింత! అలా... ఆ తోటలో..... ఆ పొదరిళ్ళ మధ్యలో...... ఆ చుక్కల పరదా క్రింద మెత్తమెత్తగా నడుస్తూ వెళుతుంటే..... వినిపించింది..... ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతున్న గలగలల సవ్వడి! "యమున....అది యమునా నదే!!" అనుకుంటూ పరుగుపరుగున వెళ్లి చూద్దునుకదా...... అదేమిటో.... నల్లగాఉండే యమున..... పున్నమి చంద్రుడి వెన్నెలకి కాబోలు.... ధవళ కాంతులతో ధగధగలాడుతోంది.... యమున ఒడ్డున ఉన్న సైకత రేణువులు... హిమరజములా అన్నంతగా మెరిసిపోతున్నాయ్! యమున ఎంత ఉవ్వెత్తున ఎగసిపడుతోందంటే...... బృందావనంలోకి వచ్చేసి ఆ అందమంతా తన చేతులతో స్పృశించాలి అనుకునేంతగా!! ఇక నెలరాజు అందం చెప్పనలవికానంతగా ఉంది..... నా కృష్ణుడి మోమల్లె!!

ఇంతలో ఎక్కడినించో.... కిలకిలమని నవ్వులు..... కోలాహలాలు...... మంద్రస్వరంలో గానం వినిపిస్తున్నాయ్! అటు వైపు తలతిప్పి చూస్తే..... ఒక పెద్దదేవగన్నేరు వృక్షం..... చెట్టునిండా పూలే..... అల్లంతదూరానికి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయ్! దానికింద.... బుల్లిబుల్లి తువ్వాయిలు గెంతులేస్తున్నాయ్! ఇంతంత తోకలతో నెమళ్ళు అటు,ఇటు తెగ హడావిడిగా తిరిగేస్తున్నాయ్! ఇంకా చాలామంది గోపీగోపికలనుకుంటా నృత్యాలు చేస్తున్నారు...... అటు వైపు వెళదామని నడక సాగించాను! దారిలో నా కాలికి అక్కడక్కడా చిన్నిచిన్నికుందేలుపిల్లలు అడ్డుపడుతున్నాయ్..... వాటిని పట్టుకుందామని..... ఒకదానివెంట పరుగుతీసాను..... ఇంతలో ఎక్కడినించి వచ్చిందో...... ఒక చిన్నారి జింకపిల్ల బెదురుబెదురుగా చూస్తూ.... నావైపు వచ్చి నన్ను చూడగానే..... పారిపోబోయింది...... నేను దానివేనకే పరుగు మొదలుపెట్టాను.....


అది... .నన్ను ఎక్కడికేక్కడికో తీసుకెళ్ళింది...... ఏవేవో వనాలు తిప్పింది..... దారిలో ఎన్నో వింతలను చూపించింది...... అయినా దానికి అలుపు రాదే! నాకు ఆయసమోచ్చేస్తోంది..... ఇంతలో ఒక పొన్నచెట్టు కనపడితే.... అక్కడ కాసేపు ఆగాను!

 ఈ జింకపిల్ల ఎటువేల్లిపోయింది అని అనుకుంటూ.... మెల్లగా ముందుకు వెళుతుంటే.... అక్కడ  ఏదో ఒక సుప్రకాశం నాకు దగ్గరవుతోంది.... క్రమంగా అది ఒక ఆకృతిని సంతరించుకుంటోంది.... నాకు బాగా పరిచయమున్న వ్యక్తిలాగే అగుపిస్తోంది....... ఆ వ్యక్తి దగ్గరయ్యే కొద్దీ దివ్యచందన పరిమళమేదో నా మేనిని చుట్టేస్తోంది..... ఒక నీలకాంతి ఆ ప్రదేశమంతా పరుచుకుంది..... ఒక మురళీరవం నా చెవుల్లో అమృతం పోస్తోంది..... ఒక అందెలరవళి నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది.... ఒక తులసిమాల నా చేతులకు అందే దూరంలో నిల్చుని ఉంది.... ఒక నెమలిపింఛం ఆ మణిమయ కిరీటంలో ఒదిగిపోయింది...... ఒక కస్తూరితిలకం నా కళ్ళకు స్పష్టంగా..... అతి దగ్గరగా కనిపిస్తోంది...... ఒక అచ్చెరువొందే సౌందర్యం ఒలికిస్తున్న నేత్రద్వయం నావైపు చూసింది! సమస్త సృష్టిని స్తంభింపజేసే ఒక చిరునవ్వు ఆ మోమున విరిసింది.... నా గుండె వేగం రెట్టింపయ్యింది...... నా ఊపిరి  క్రమంగా బరువైపోతోంది ...... నా శరీరంలో ఆణువణువూ కంపిస్తోంది..... కానీ పెదవులు మాత్రం........ అతి కష్టం మీద  పెగుల్చుకుని ఒక్క పదం ఉఛ్ఛరించాయి..... 'కృష్ణా!'

అంతే.... లేచి చూసేసరికి చుట్టూరా నా స్నేహితులు..... కంగారుగా నా కళ్ళలోకి చూస్తున్నారు! 'అరె.... ఇప్పుడే కదా... ఇంత దగ్గరగా చూసాను.... ఆ నీలమేఘశ్యాముడిని..ఏడీ?? నా కృష్ణుడు ఏడీ?'...... నాకంతా అయోమయంగా ఉంది..... 'అంటే....ఇదంతా కలా? అయ్యో.... నిజమైతే ఎంతబాగుండేది?' ఒక్క క్షణం దుఖం తన్నుకొచ్చింది.....

'కృష్ణా! ఇదంతా నిజమైతే  బాగుండు కదా....ఎందుకిలా చేసావ్? కనిపించినట్టే కనిపించి మాయమయ్యావా కన్నయ్యా?' అని బాధగా మనసు అడుగుతుంటే.... కళ్ళు శ్రావణమేఘాల్లా వర్షిస్తున్నాయి..... ఎందుకో అప్రయత్నంగా నా హ్యాండ్ బాగ్లో చేయి పెట్టాను..... నా పాటల పుస్తకం బైటకు తీశాను! ఇంకొక్క పాట.... ఒకేఒక పాట రాస్తే...... ఇక ఈ బృందావనవిహారికి అంకితమివ్వొచ్చు!! కానీ ఇప్పుడు ఈ బాధలో.... ఎలా?నావల్ల కాదు.... ఇక ఇప్పటికీ ఇంతే ప్రాప్తం.... మళ్లీ ఎప్పుడు ఈ పుస్తకం పూర్తి చేస్తానో..... ఈ గోపాలునికి ఎప్పుడు అర్పితం చేస్తానో.... అనుకుంటూ...... చివరి పేజి తెరిచాను.....

ఆశ్చర్యం!!!!..... నా గుండె ఒక్క క్షణం  ఆగి కొట్టుకుంది......
నా చేతివ్రాతలో రాసి ఉంది... నా 5000వ పాట! ఇందాక కలలో నేను విన్న ఆ గోపికలు పాడిన పాట! కానీ... ఇది ఎలా సాధ్యం? అంటే.... ఇందాక నేను చూసింది..... కలా? నిజమా?.....

వేవేల మురళీస్వరాలు ఒక్కసారిగా చుట్టుముట్టిన అనుభూతి.....
రంగురంగుల పూలబంతై ఊయలూగుతున్నట్టున్న జగతి....
నన్నల్లుకుపోతున్న మధురాధిపతి అందించిన మధురగీతి. 

ఒక్కసారి ఆ దేవదేవుని మనసారా స్మరించి......కృష్ణస్పర్శతో పునీతమైన ఆ పాటల పుస్తకాన్ని ఆర్తితో ముద్దాడి నా మురళీమనోహరుడి దివ్యచరణాలవిందాలకు సమర్పించాను!
  


[కృష్ణాష్టమి సందర్భంగా వ్రాసిన ఈ బుల్లి కథ నా బుజ్జి కిట్టుగాడికి అంకితం :) ]

2, మార్చి 2011, బుధవారం

శివ..శివ...హర..హర!

'ఓం నమశ్శివాయ'

ఇవాళ శివరాత్రి కదా! శివుడికి బోలెడు ఇష్టమైన రాత్రి....లయకారుడు లింగోద్భవమై  దర్సనమిచ్చే రాత్రి! మనం  శివరాత్రి ముచ్చట్లు....అలాగే శివుడికి నాకు మధ్య డిష్యు-డిష్యుం అన్నీ చెప్పేసుకుందామే!

ఇప్పుడంటే నాకు కృష్ణుడంటే వల్లమాలిన భక్తీ కానీ....చిన్నప్పటినించి నాకు తెలిసిన దేవుడు శివుడే! మా ఇంట్లో పెద్ద శివుని పటం ఉంటుంది.అది ఒక పెయింటింగ్.ఏదో పెయింటింగ్ ఎక్జిబిషన్ లో నాన్నగారికి బాగా నచ్చి దాన్ని తీసుకొచ్చి ఫ్రేం కట్టించారు! మా ఇంట్లో శివుడి బొమ్మలాంటి బొమ్మ మరెక్కడా చూడలేదు! సాక్ష్యాత్తు శివుడే వచ్చి యోగముద్రలో తపస్సు చేస్తున్నట్టు ఉంటుంది :) 


మా ఇంటికి కూతవేటు దూరంలో 'మల్లిఖార్జున స్వామీ' దేవాలయం ఉండేది.ఆ గుడి ప్రధాన పూజారి మాకు బాగా తెలుసు! ప్రతి సోమవారం అభిషేకం....పండగ రోజుల్లో,పుట్టిన రోజులకి అర్చన....అలా ఆ గుడంటే క్రమంగా ఇష్టం ఏర్పడింది. ఎక్జాంస్ అప్పుడు రోజు ఆ గుళ్ళో దేవుడికి దణ్ణం పెట్టుకుని పరీక్ష రాయడానికి వెళ్ళేదాన్ని! ఆ స్వామి దయవల్లేనేమో.....ఇంత బాగా చదువులు అబ్బాయి మాకు! నా చిన్నప్పుడు ప్రతి శివరాత్రి ఆ గుళ్ళోనే జరిగింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫుల్లుగా స్వెట్టర్లు వేసుకుని, ఆ చలిలో బయలుదేరేవాళ్ళం గుడికి.ఇక పూజారి అప్పుడు పూజ మొదలు పెట్టి ఏకాదశ మహారుద్రాభిషేకం చేసి....చివరికి సరిగ్గా పన్నెండు గంటలకి లింగోద్భవ వేళ స్వామీ వారి దర్సనం చేయించేవాడు! ఆ చలిలో అలాగే ముడుక్కుని....కళ్ళ మీదకి నిద్రోస్తున్నా ఆపుకుని.... పంచాక్షరిని జపిస్తూ అలాగే కుర్చునేదాన్ని! నేను చలికి వణుకుతూ ఉంటె...అమ్మ చెప్పేది...'శివరాత్రికి చలి శివ...శివా...అని పారిపోతుంది.ఇక చలి బాధ ఉండదులే' అని :) 


కొద్దిగా పెద్దయ్యాక మాకు ఇక గుడికి వెళ్ళే తీరుబడి లేకపోయింది. నేనే ఇంట్లో ఎలాగో అలా ఒంటిగంటవరకు జాగారం(!) చేసి.....నా ముత్యాల దండనే జపమాలగా అనుకుని పంచాక్షరిని జపిస్తూ అలాగే పక్కకి ఒరిగి నిద్రపోయేదాన్ని ..... అలా ప్రతి శివరాత్రి ఇలా జాగారం చేయడం....శివనామస్మరణ చేయడం అలవాటయిపోయాయి! క్రమంగా పరిస్థితులు మారాయి.శివరాత్రికి ఏదో ఒక పవిత్ర క్షేత్రానికి వెళ్ళడం అలవాటయింది.అలా ఒకసారి  శ్రీశైలం వెళ్ళాం! కాని అనుకోకుండా కొన్ని కారణాలవల్ల తిరిగి వచ్చేసాం! అప్పుడు ఎంత బాధేసిందో! నా ఫేవరేట్ పుణ్యక్షేత్రం- శ్రీశైలం. ఆ మల్లిఖార్జునున్నిచేతులార తాకి.....తలని ఆ లింగానికి ఆన్చి మొక్కుకుని....చేతులకు అంటిన ఆ పవిత్ర లింగం యొక్క విభూదిని మహాప్రసాదంగా భావించి ఒక అలౌకికమైన ఆనందంలో మునిగితేలుతూ....బైటికి వస్తుంటే.... 'ఈ గుడిలో శిలనైనా కాకపోతిని స్వామీ నీ సేవ చేయగా ' అని అనిపిస్తుంది! శ్రీశైలం ఇప్పటికి ఏ ముప్పయ్ సార్లో వెళ్లుంటాం....కనీసం ఏడాదిలో మూడు-నాలుగు సార్లు కంపల్సరీ.కాని శివరాత్రి రోజు వెళ్ళాలనే కోరిక మాత్రం తీరలేదు :(

ఇక శివరాత్రి స్పెషల్ అంటే గుర్తొచ్చేది మా గుంటూరు జిల్లా కోటప్పకొండ. అసలు ఈ టైంకి హడావిడే హడావిడి! పెద్ద పెద్ద ప్రభలు కడతారు...వాటిని ఊరేగిస్తూ కొండమీదకి తీసుకెళ్లడం అది ఇంకా పెద్ద ప్రహసనం.అవి తీసుకు వెళ్ళేటప్పుడు ఆ దారిపొడవునా కరెంటు తీస్తారు.ఆ ప్రభలు అంత పొడవుగా ఉంటాయ్ మరి! ఆ తరువాత ఇక తిరునాళ్ళ! కొండమీద తిరునాళ్ళ జరిగాక....మరుసటి రోజు నరసరావుపేటలో పల్నాడు రోడ్డులో 'శివుడి బొమ్మ సెంటర్' దగ్గర మళ్లీ ఇంకోసారి తిరునాళ్ళ జరుగుతుంది. ఆ రోజు కూడా ఊరంతా ప్రభలను ఊరేగిస్తారు. వాటిముందు డాన్సులు వేస్తారు....అబ్బో....గోలగోలలే! :))


మా కోటయ్య స్వామీ మాత్రం ఏం తక్కువ తిన్నాడు!ఇక్కడ ఎంత పద్దతిగా అభిషేకం చేస్తారో! శ్రీశైలంలో హడావిడి కార్యక్రమం ఐతే....ఇక్కడ చాల నిమ్మళంగా..కుదురుగా చేస్తారు. కన్నులపండువగా చూడొచ్చు అంతసేపు స్వామిని. ఐతే....శ్రీశైలం లో స్వామిని తాకే బంపర్ ఆఫర్ ఇక్కడ లేదుగా! అందుకే...దేనికి అదే సాటి :)) నేను ఒకే ఒక్కసారి తిరునాళ్ళకి వెళ్ళా! మా ఫ్రెండు వాళ్ళ తాతయ్య ఒకరు కోటప్పకొండలో ఉన్న ఒక సత్రానికి అధికారి :) ఆయన వి.ఐ.పీ టిక్కెట్లు ఉన్నాయ్...రమ్మంటే నేను,మా ఫ్రెండ్సు వెళ్లాం :)) కాని మేము వెళ్ళేసరికే ఎవరో వచ్చి ఆ టికెట్లు తీసుకేల్లిపోయారట! అలా కొండ ఎక్కి మరీ స్వామిని చూడకుండా వచ్చేసాం! :(

హ్మ్! ఇన్ని చెప్పి మా అమ్మమ్మగారి ఊళ్ళో శివుడి గురించి చెప్పలేదు చూడండి? అయినా మీకు తెలిసిందే కదా ఆ సంగతి.....మా క్షీరా రామలింగేశ్వర స్వామీ.....ఎంత మంచోడో! ఈయనోక్కడే కొంచెం నామీద జాలి చూపించాడు! :D


ఇదెక్కడి చోద్యమో! అటు శ్రీశైలం వెళితే....మల్లన్న....'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అన్నాడు....ఇటు కోటప్పకొండలో ...కోటయ్య కూడా....' ఈసారికి ఇలా కానిచ్చేయ్ నాన్నా! ఇంకోసారి చూద్దాంలే!' అన్నాడు. ఈసారి ఇక్కడ మిషిగన్లో...ఫ్లింట్ లో 'పశ్చిమ కాశి' అని పెద్ద శివుని గుడి ఉంది. ఎంత బాగా పూజ చేస్తారో.....అక్కడికి వెళ్దామంటే కుదరనీయకుండా ఒక అడ్డుపుల్ల వేసాడు! హ్మ్! శివుడు బహు చమత్కారి సుమా!!


శివుడెమైనా నా విషయంలో హార్ట్ అయ్యాడా? నేనేం చేసానబ్బా? ఓ! కిట్టుని ఎక్కువగా పట్టించుకుని....శివుడి విషయంలో కొంచెం కినుక వహించాను అనేమో! ఎమన్నా ఉంటే మాట్లాడుకోవాలికాని ఇలా అలిగితే ఎలా?  ఏదేమైనా....శివుడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు.ఐ హార్ట్! ఐ హార్ట్ అంతే!! ఇప్పుడు ఇద్దరికీ డిష్యుం-డిష్యుం. శ్రీశైలం వెళ్లి సుమారు రెండు సంవత్సరాలౌతోంది!! ఎవరికీ చెప్పను నా బాధ?? (అమ్మో! ఇలా బాధపడుతున్నా అని తెలిస్తే....శివుడు ఇంకా బెట్టు చేస్తాడో ఏమో!!....)

హ్మ్! ఇక చేసేదేముంది? ఆయనగారి అలక తీరేవరకు నాకు శివరాత్రి రోజున శివాలయంలో శివుని దర్సనం లభించదు :)) అంతే!

అదండీ నా శివరాత్రి సంగతుల్స్! వాట్ ఎల్స్!?

ఓకే మరి....అందరు ఉపవాసాలు చేసి....జాగారాలు చేసి...శివుడి కటాక్షం పొందండి....జాగారం అంటే...బ్లాగుల ముందు...బజ్జుల ముందు కూర్చోడం కాదు ;) శివనామస్మరణ చేయాలి....అర్ధమయిందా? ;) 

'ఓం నమశ్శివాయ' అనండి....అన్నారా? లేదా?.....అద్దీ అలా మంచిగా మాట వినాలి :) 

మరొక్క సారి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు :) 

'ఓం నమశ్శివాయ'

5, నవంబర్ 2010, శుక్రవారం

దివ్వెల పండుగ


కోటి కాంతుల వెలుగులు విరజిమ్మే "తారాజువ్వలు" .......

నవ్వుల పువ్వులు పూయించే "కాకర పువ్వోత్తులు ".........

ఆనందాల వెల్లువ పొంగించే  "మతాబులు ".....

తారా తోరణాలను ఇంటిముందు వాల్చే "దీపాల కాంతులు"...

వెరసి...
చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనం...ఈ దివ్వెల పండుగ....

సంతోషాల దీపావళి...అందరి జీవితాల్లో వెలుగులని పంచాలని ఆశిస్తూ...


అందరికీ 'దీపావళి' శుభాకాంక్షలు....

18, అక్టోబర్ 2010, సోమవారం

కన్నుల పండువ గా...

గత మూడు రోజులు....దసరా ఉత్సవాల్లో ముఖ్యమైనవి.....అష్టమి మొదలుకుని దశమి వరకు...సందడే సందడి....


మేము...మాకు దగ్గరలో ఉన్న గుళ్ళు అన్నీ చుట్టేసాం ఈ మూడు రోజుల్లో......కాంటన్,పశ్చిమ కాశీ,భారతీయ టెంపుల్,పరాశక్తి టెంపుల్....కానీ అన్నిటికంటే అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలు చేసినది మాత్రం 'పరాశక్తి టెంపుల్' లోనే.... నవరత్రుల్లు మొదటి రోజున వెళ్ళాము ఈ గుడికి ....ఆ రోజు వైభవం చూసే..దశమి రోజు ఇంకెంత బాగుంటుందో అనుకున్నా.... అనుకున్నదానికంటే ఘనంగా నిర్వహించారు......


ముఖ్యంగా అమ్మవారి విగ్రహం...అలంకరణ,....పూజ విధానం....ఆలయ కమిటి డిసిప్లిన్ వెరసి....పరాశక్తి గుడి ఈ నవరాత్రి మహోత్సవాలలో అన్నిటికంటే మిన్నగా ఉంది అని చెప్పొచ్చు....అదేమిటో మరి! మిగితా అన్నీ  గుళ్ళు వెలవెల బోయినట్లు ఉన్నాయి....ఒక్క ఈ గుడి తప్ప....


ఇక నిన్న...అనగా దశమి రోజున...అసలే అందంగా అలరారే అమ్మవారిని ఇంకా అందంగా అలంకరించారు.... గులబిమాలలతో...రక రకాల పూల తో చేసిన ఆ అలంకరణ వర్ణనాతీతం ...అమ్మవారిని చూస్తే నాకు అన్నమయ కీర్తన గుర్తొచింది....'ఏమని పొగడుదుమే ఇక నిను!! ఆమని సొబగుల అలమేల్మంగా!! ఏమని పొగడుదుమే!!' అని.... అలంకరణ తరువాత దర్శనం అయ్యాక పూజారులు చదివిన వేదాలు ఆ హాల్ లో ప్రతిధ్వనిస్తుండగా అందరూ అలౌకికమైన భక్తీ పారవశ్యం లో మునిగిపోయారు...సుమారు  మూడు గంటలు....ఎటువంటి విసుగు,చికాకు లేకుండా దైవధ్యానం లో యిట్టె గడిచిపోయాయి....


ప్రతి సంవత్సరం నాకు దసరాలు అపుడు శ్రీశైలం వెళ్ళడం అలవాటు....క్రిందటి ఏడాది నాన్నగారికి బాగోక వెళ్ళలేదు..అలా తప్పిన ఆనవాయితీ ఈ సారి అలవాటయింది....అయినా కూడా ఆ లోటు తీర్చేసినట్టు దర్సనమిచ్చిన పరాశక్తి మాతకు నమస్సుమాంజలి.....


దసరా చివరి మూడురోజులు...చాలా ఆహ్లాదంగా,ఆనందంగా  గడిచాయి...ఆ తల్లి అందరికీ సకల శుభాలని అనుగ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను....

11, అక్టోబర్ 2010, సోమవారం

ఆలయాలు....వాటి విశిష్టత....


















హిందుత్వం....ఒక మతం లా కాక ఒక సాంప్రదాయం లా నేను భావిస్తాను..గౌరవిస్తాను...


ఒక మనిషి సమాజం లో ఎలా మెలగాలి...తన విధులు,పరిధులు,భాద్యతలు అనునిత్యం  గుర్తు చేసేదే హిందుత్వం.ప్రక్రుతి లో మమేకమై మెలగడం కూడా అందులో ఒక భాగమే..

షికాగో లో 'స్వామీ నారాయణన్' గుడికి వెళ్ళాను....అక్కడ లోపలికి  వెళ్ళే దారిలో కొన్ని ఫోటో ఫ్రేమ్స్  పెట్టారు....వాటిల్లో మన ఆలయాల గురించి వ్రాసిన కొన్ని వ్యాఖ్యలు నాకు నచ్చాయి...ఆలయాలకి-ప్రకృతికి ముడి పెడుతూ...మనిషి యొక్క ఆలోచనలను ప్రభావితం చేసేవిగా చెప్పబడిన ఆ వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను....


ఆలయ శిఖరం-పర్వత శిఖరం వలె ఎత్తు గా ఉండి,దైవం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని అది చేరుకోవడం ప్రతి జీవి యొక్క  జన్మ కి పరమార్ధం  అని సూచిస్తుంది.అందుకే ఆలయాలు...పర్వతాలను పోలి ఉంటాయి.

ఆలయ కలశం-అమృతత్వానికి చిహ్నంగా,స్వచ్చతకు ప్రామాణికంగా నిలుస్తూ మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని సూచిస్తుంది.

ఆలయ స్థంబాలు-అడవిలో నిటారుగా,ధృడంగా ఉండే చెట్ల వలె ఉండి....ధృడ చిత్తానికి సంకేతంగా ఉంటాయి.

ఆలయ పతాకము-ధ్వజ స్థంబం మీద ఉండే పతాకము...చెడు పై మంచి  సాధించిన విజయానికి ప్రతీక గా రెపరెప లాడుతూ ఉంటుంది.

ఆలయం పై కప్పు- జ్ఞానాన్ని మనిషి మీద కురిపిస్తున్నట్టు గా దైవత్వానికి చిహ్నంగా ఉంటుంది.

ఆలయ కుడ్యాలు-ఆలయం గోడలపై,స్థంబాలపై,పైకప్పు  పై  చెక్కే పూలు,లతలు....రాయిని కూడా పూవు గా మలచబడే కోమలత్వానికి చిహ్నంగా నిలుస్తుంది.

చిరుగంటలు-చిరుగాలికే కిల కిల మంటూ ఊగే గంటలు....మనసులో ఉండే చెడు ఆలోచనలు దూరం చేసి దైవం మీద ధ్యాస ఉండేలా చేస్తాయి.

గుడిలో వెలిగించే దీపం- అజ్ఞానపు అంధకారాలను  పారద్రోలి....ఎల్లప్పుడూ ప్రకాశించే ఆ దేవదేవుని దివ్య ముఖారవిందం లా  కోటి సూర్యకాంతి ప్రతిఫలిస్తుంటుంది.

గర్భాలయం లో మూర్తులు- 'మూర్తి పూజ' అనేది దైవానికి పక రూపం ఇచ్చి,ప్రాణ ప్రతిష్ట  చేసి...మనసు పరిపరి విధాల పోకుండా ఆ మూర్తి మీదే నిలిపి...ధ్యానించడానికి...ముక్తి ని పొందడానికి.....

ఇవి...మన ఆలయాలలో ఉండే విశిష్టత....గుడి లో చేసే ప్రతి కార్యం,విధానం కి ఏదో ఒక సూక్ష్మార్ధం ఉంటుంది అని పెద్దలు చెప్పే మాటలు నిజమనిపించాయి అవి చూసిన తరువాత.మన వాళ్ళు గుళ్ళు అల్లాటప్పా గా కట్టలేదు...చాలా విశ్లేషించి,లోతు గా అలోచించి నిర్మించిన అద్భుతాలు....మన ఆలయాలు.

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

పరాయి దేశం లో వినాయకచవితి....





దీపావళి,ఉగాది లాగే నాకు నచ్చే పండుగ ఈ 'వినాయక చవితి' .....బోలెడంత హడావిడి,అలంకరణ,పత్రి,చంద్రుడు వెరసి చిన్నప్పటినించి యే పండుగ జరిపినా జరుపుకోకపోయినా ఈ వినాయకచవితి మాత్రం ఘనంగా జరుపునేవాళ్ళం.....


అటువంటిది దేశం కానీ దేశం లో మొదటి సారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ.....


రెండు రోజుల ముందు నుంచే చందు ని హింసించడం మొదలుపెట్టాను....పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా?? ఉండ్రాళ్ళకి బియ్యపు రవ్వ ఎక్కడ  కొనాలి ?? మరి పాలవెల్లి సంగతేంటి ?? వ్రతకథా పుస్తకం ఎలా ?? బంతిపూల మాలలు దొరకవుగా మరి పూలు ఎలా?? ఇలా అది ఇది అని విసిగించేసా.....


ముందుగా పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న 'ఇండియన్ స్టోర్స్' అన్నీ తిరిగాం....అందరూ 'ఈసారి రాలేదండి' అనేవాళ్ళే..!! 'అయ్యో!!' అని ఉసూరుమంటూ వెను తిరిగి వచ్చేసాం...అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా?? పాలవెల్లికి  పసుపు రాసి కుంకుమ పెట్టి గోడకి కట్టి దానికి ఆపిల్ కాయలు,దానిమ్మ కాయలు,వెలక్కాయలు,మొక్కజొన్నలు,అరటి పిలకలు,మామిడాకులు,బంతిపూల మాలలు,కలువ పువ్వులు వంటివన్నీ అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది!! ఇక లాభం లేదని ఇంటికి వచ్చి గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టా....ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు..... సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్ లో 'పాలవెల్లి ని నేనే తయారు చేసుకున్నా!!' అని పోస్ట్ కనిపించింది. వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. 'అవును కదా మనమే చేసుకుంటే పోలే!!' అనుకుని చందూ కి చెప్పా!! సరే అని ఇద్దరం ముందు 'వాల్ మార్ట్' కి వెళ్లి కావాల్సిన చెక్కముక్కలు వెతికే పనిలో పడ్డం....దొరకలేదు....ఏంచేయాలో పాలుపోలేదు....సరే మిగితావి తీసుకుందాం  ఈ లోగా ఏదో ఒకటి ఆలోచన రాకపోదు అని బయలుదేరాం. 'క్రోగర్' లో పూల బొకేలు ఒక మూడు,అరటిపళ్ళు తీసుకున్నాం ...... 'నమస్తే' కి వెళ్లి కొబ్బరికాయలు తీసుకున్నాం.వచ్చేటపుడు వాళ్ళు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు,రెండు అరటిపళ్ళు ,ఇంకా ఏవో నాలుగు పళ్ళు ఇచ్చారు...'హమ్మయ్య !! అసలు మామిడాకులు లేకుండా పండుగ ఉహించుకోగలమా !!' అనుకుని ఇక మట్టి వినాయకుని వెదికే ప్రయత్నం మొదలుపెట్టాం. ఏ షాపులో చూసినా రంగులేసిన వినాయక విగ్రహాలే....నాకేమో స్వచ్చంగా,అచ్చంగా మట్టి తో చేసిన వినాయకుడే కావాలి....చివరికి ఒక షాపులో దొరికింది. భలే బుజ్జిగా ఉన్నాడు....చిన్న గొడుగు తో సింహాసనం మీద ఠీవి గా కూర్చున్న గణపతి :) ఈ షాపు లో కూడా పండగ సందర్భంగా మామిడాకులు ఇచ్చారు....


తమలపాకులు,వక్కలు,చందనం,చిన్న దీపపు ప్రమిదలు తీసుకుని ఇక పాలవెల్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. చెక్కలు కావాలంటే  'హోమ్ డిపో' కి వెళ్లి తెచ్చుకోవాల్సిందే అనుకుని అక్కడకి వెళ్ళాం....ఎలాగో అలా కష్టపడి మాకు కావాల్సిన విధంగా చిన్నగా ఉన్న చెక్కముక్కలు,వాటిని కోయడానికి పదునైన చాకు,మేకులు,పురికొస తీసుకుని ఇంటిదారి పట్టాం. ఇంటికి రాగానే పాలవెల్లి ని తయారు చేసే పనిలో చందూ మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా....చెక్కలని కష్టపడి కోసి,మేకులు కొట్టి,ఎలాగో అలా  చందూ గారి దయ వల్ల 'పాలవెల్లి' తయారయింది.....ముద్దుగా బొద్దుగా భలే ఉంది :) ఇక దాన్ని ఎలా వ్రేలాడదీయాలి అని డౌట్!! గోడకి పెద్ద మేకు కొడితే రంధ్రం ఏర్పడుతుంది....అది ఇష్టం లేదు....అలా కాకుండా ఇంత బరువైన పాలవెల్లి ని మోయడం  చిన్న మేకుల పని కాదు .'ఏం చేయాలా ??' అని ఆలోచిస్తుంటే....ఇంకో ఆలోచన వచ్చింది....వెంటనే మా సైడ్ టేబుల్ ని పూజామందిరం చేసేసా...కింద పైన రెండు  గ్లాసులు ఉన్న సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు..పైన పాలవెల్లి పెట్టొచ్చు....కావాల్సిన పండ్లు వ్రేలాదదీయోచ్చు....అని అనుకున్నాం....హమ్మయ్య అప్పటికి మనసులు కుదుట పడ్డాయి....


మొత్తానికి చవితి రోజున పొద్దున్నే లేచి త్వర త్వరగా వంట కానిచ్చేసి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం.పాలవెల్లి ని పూల తో అలంకరించి,దానికి ఆపిల్స్,మొక్కజొన్నలు,పళ్ళు కట్టి ,దేవుడిని నానావిధ పుష్పాలతో అలంకరించి,పత్రి కోసం మామిడాకులు,దగ్గరలో ఉన్న కొన్ని చెట్ల ఆకులు తీసుకొచ్చి,లాప్ టాప్ లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేయడం మొదలుపెట్టాం. ఈలోగా పండగ పూట అతిధి గా 'నాని' గారు వచ్చారు.....సావధానంగా,దివ్యంగా పూజ చేసుకుని, పులిహోర-పొంగలి-కుడుములు-ఉండ్రాళ్ళు-వడపప్పు-పానకం  తో పాటు మహానైవేద్యం పెట్టి కథాశ్రవణం  చేసి అక్షతలు వేసుకుని పూజ ముగించాం.తరువాత తీర్ధప్రసాదాలు స్వీకరించి నాని గారికి కూడా అందించాం.'ఇండియా ని గుర్తు చేసారండి ఒక్కసారి' అన్నారు నాని గారు.....చాలా సంతోషమేసింది :)


ఆనక నాని గారితో భోజనం చేశాం.....ఆ రోజు రాత్రికి అతిధులు గా కృష్ణ-ప్రసన్న,ఇంకో కృష్ణ వచ్చారు......మా మందిరం,పాలవెల్లి చూసి ముచ్చట పడ్డారు వారు కూడా.....వారికి తీర్థప్రసాదాలు అందించాం.....ఇక రాత్రి ఎలాగైనా చంద్రున్ని చూడకూడదు అని కిటికీ బ్లైండ్స్ అన్నీ వేసేసి దుప్పటి కప్పేసుకుని నిద్రపోయా :D




అలా పరాయి దేశం లో కూడా చక్కగా వినాయకచవితి జరుపుకున్నందుకు  చాలా సంతోషంగా ఉంది :)

1, సెప్టెంబర్ 2010, బుధవారం

జయ జయ దేవ హరే



శ్రిత కమలాకుచ మండలా........ద్రుత కుండలా....ఈ కలిత లలిత వనమాల....
జయ జయ దేవ హరే ...జయ జయ దేవ హరే....                                                ||జయ జయ||    
దినమణి మండల మండనా......భవ ఖండనా......ఈ మునిజన మానస హంసా      ||జయ జయ||
కాళియ విష ధర గంజనా..........జన రంజన........ఈ యదుకుల నళిన దినేశా        ||జయ జయ||
మధు ముర నరక వినాశనా......గరుడాసనా.......ఈ సురకుల కేళి నిదానా            ||జయ జయ||
అమల కమల దళ లోచనా........భవ మోచనా.....ఈ త్రిభువన భవన నిదానా         ||జయ జయ||
జనక సుతా కృత భూషణా........జిత దూషనా......ఈ సమరశమిత దశకంఠా          ||జయ జయ||
అభినవ జలధర సుందరా.........ద్రిత మంధరా......ఈ శ్రీముఖ చంద్ర  చకోరా            ||జయ జయ||
తవ చరణే ప్రణతావయా...........ఇతి  భావయా.....ఈ కురు కుశలం ప్రణతేశూ         ||జయ జయ||
శ్రీ జయదేవ కవేరిదం...............కురుతేముదం.....ఈ మంగళ ఉజ్వల  గీతం           ||జయ జయ||


అర్ధ్ధం :


లక్ష్మీదేవి ని వక్షస్థలమునందు,కర్ణములకు కుండలాలను,మెడలో తులసిమాలను ధరించిన హరీ నీకు జయము జయము....
ప్రచండ సూర్యునివలే ప్రకాశిస్తూ,ఆలోచనలను ఖండిస్తూ,మునుల హృదయాలలో హంసవలె విహరించే  హరీ నీకు  జయము జయము
కాళియుని విషాన్ని హరించి,జనరంజకుడవై,యదుకుల రత్నమై వెలిగే హరీ నీకు జయము జయము....
మధు-ముర రాక్షసులను వధించి,గరుత్మంతుని అధిరోహించి,దేవలోకాన్ని రక్షించిన హరీ నీకు జయము జయము....
కలువరేకుల వంటి కన్నులతో,భవమోచన కలిగించే,త్రిభువన నాధుడవైన హరీ నీకు జయము జయము....
జానకి దేవిని చేపట్టి,అధర్మాన్ని జయించి,రావణుడిని వధించిన హరీ నీకు  జయము జయము...
నీలమేఘ శ్యాముడవై,మంధర పర్వతాన్ని మోసి, చంద్రుని వలె అందమైన ముఖారవిందాన్ని కలిగిన హరీ నీకు జయము జయము...
నీ చరణారవిందాలకి ప్రణమిల్లుతూ,నీ కరుణా కటాక్ష వీక్షణాలు కోరుతూ...జయదేవుడు నీకై వ్రాసిన,మంగళకరమైన గీతం ఈ గీతం....
హరీ నీకు  జయము జయము...శ్రీ హరీ నీకు జయము జయము....


-జయదేవ(గీత గోవిందం)  


అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు...ఈ శుభ దినాన ఆ దేవదేవుని పాదారవిందాలకు నమస్కరిస్తూ చిరు కానుక గా సమర్పించిన జయదేవుని అష్టపది... 

7, ఆగస్టు 2010, శనివారం

స్మరణం


శ్లో|| కృష్ణాంగ మాధుర్య సింధు...సుమధుర ముఖ ఇందు.....అతి మధు స్మిత సుకిరణే.....

అంటే....
పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు 'మహా సాగరం' వంటి వాడు...అతని యొక్క దివ్య ముఖారవిందం సముద్రం నించి ఉద్భవించిన చంద్రుని వలె ఉంటుంది.....అతని యొక్క చిరునవ్వు మధురాతిమదురంగా ఉండి వెన్నెల కిరణాల వలె ప్రసరిస్తుంది....