అక్టోబర్ 24 రాత్రి.....ఇంకొద్ది సేపట్లో
25 వచ్చేస్తుంది...ఇది నా జీవితం లో పెద్ద మలుపును తెస్తుంది...ఎవరికైనా జీవితం లో మార్పులు,అధ్బుతాలు సంభవించాకే తెలుస్తాయి...కానీ ఇది అలా కాదు.....అంతా తెలిసినట్టే ఉంటుంది...ఒక పక్క మనసంతా ఆనందం...లోలోపల గుండె పొరల్లో ఎక్కడో గూడు కట్టుకున్న దుఖం.....సరిగ్గా సంవత్సరం క్రితం ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాను...ఇంట్లో ఎవరు లేరు...నేను,బామ్మ తప్ప......అమ్మ దగ్గర ఉంటే బాగుండు అని ఎన్ని సార్లు అనిపించిందో ...కానీ పనుల హడావిడి కదా..ఇంతలో నా బెస్ట్ ఫ్రెండ్ రోహిణి వచ్చింది...గోరింటాకు పెట్టటానికి...చందు కి ఆకుగోరింటాకు ఇష్టం....అచ్చం నాలాగే..కానీ ఫోటోలలో సరిగ్గా పడదని మా ఆస్థాన కెమెరామెన్ గారు ఇచ్చిన ఆదేశాలతో తప్పక కోన్ పెట్టించుకుంటున్నా ......రోహిణి తన సంగతులేవో చెప్తోంది.........కానీ నా మనసు ఆలోచనా తరంగాలలో కొట్టుకుపోతోంది.....ఇక రేపటినించి ఈ ఇల్లు నా ఇల్లు కాదు కదా!! నేను ఇక్కడ ఎప్పటిలా మహారాణి లా ఉండలేను కదా!! అమ్మ ని,నాన్న ని వదిలి ఒక్క రోజు ఉండలేనే!! ఇక జీవితమంతా ఎలా??కంటి నించి ఉబికి వస్తున్న ఒక్కొక్క చుక్క పాదాలకు పెట్టిన గోరింటాకు మీద పడుతోంది.... మళ్లీ రోహిణి గమనిస్తుందేమో అని ముంగురులు సరి చేసుకుంటున్నట్టు కళ్ళు తుడుచుకోవడం....అలా ఆ రోజు రాత్రి పది గంటలకు గోరింటాకు పూర్తయి రోహిణి వెళ్ళిపోయింది...
మళ్లీ మనసును ఆవరించేసింది దిగులు....ఇంతలో బామ్మ అన్నం కలిపి తీసుకొచ్చింది....'ఒద్దు బామ్మ తినాలని లేదు' అన్నాను... 'మళ్లీ నా చేతులతో ఎప్పుడు పెడతానో...నువ్వెప్పుడు తింటావో....తినవే!!' అని ముద్దలు కలిపి పెడుతుంటే...మళ్లీ కళ్ళు చెమర్చాయి...అమ్మ కావాలి!! నా మనసు ఒకటే గోల పెడుతోంది... నాకు బాధ అయినా సంతోషం అయినా అమ్మే!! అందుకే అమ్మ ఒడిలో పడుకుని అలాగే ఉండిపోవలనిపిస్తోంది.... అది చూసి బామ్మ 'ఎందుకె పిచ్చి తల్లి ఏడుస్తావ్?? మళ్లీ రేపు కళ్ళు ఎర్రగా అవుతాయి... అన్నం తినేసి హాయిగా పడుకో....' అని అంది.....సరే అని అలాగే అన్నం ముగించేసి మంచం మీద పడుకున్నా నిద్ర రాదే?? ఎన్నో ఆలోచనలు...రేపు నేను ఏంటి?? నా పరిస్తితి ఏంటి?? అక్కడ అంతా ఎలా ఉంటుందో?? వాళ్ళందరూ ఎలా ఉంటారో??? అసలు అమ్మాయిలకే ఎందుకు ఇంత బాధ??? నేనెందుకు అమ్మ-నాన్న ని వదిలి వెళ్ళాలి??? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను....రాత్రి రెండింటికి అమ్మ-నాన్న పిన్ని,బాబాయ్ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చారు....అప్పటిదాకా నిద్ర పోకుండా అలాగే కూర్చున్నా. నన్ను అమ్మ దగ్గరకి తీసుకుంది.... నా సంగతి అమ్మ కి బాగా తెలుసు....అందుకే ఒళ్లో బజ్జో పెట్టుకుని మెల్లగా జోకొట్టింది....ఎప్పుడు నిద్రపోయానో.....అమ్మ చేతి స్పర్స మహత్యం కాబోలు...
అక్టోబర్ 25 ....
పొద్దున్నే లేచేసరికి....అమ్మ-నాన్న అప్పటికే రెడి అయి మండపానికి వెళ్ళిపోయారు......'ఇందు...టు-డే ఇజ్ ఏ బిగ్ డే..' అనుకుంటూ నిద్ర లేచా!!సెల్ చూస్తే రోజు పొద్దున్నే ఠంచను గా వచ్చే చందు మెసేజ్ లేదు.....కోపమొచ్చి 'హ్యాపీ వెడ్డింగ్ డే' అని మెసేజ్ కొట్టి సెల్ పక్కన పడేసా!!తరువాత అత్త,పిన్ని,ఆమ్మ వాళ్ళు నాకు మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతుర్ని చేయడం మొదలు పెట్టారు ....ఇంతలో అమ్మ వాళ్ళు వచ్చారు....ఆ కార్యక్రమం అయ్యాక....నన్ను మండపానికి తీసుకెళ్ళి ఏదో పూజ చేయించారు.....మండపం లోకి అడుగు పెడుతుండగా స్టేజ్ మీదకి చూసా...పాపం చందు....తెల్లవారు ఝామున మూడు నించి ఆ అగ్నిహోత్రం ముందే అట...కళ్ళు ఎర్ర మిరపకాయల్లా ఉన్నాయ్....ప్రళయ కాల రుద్రుడు లా చూస్తున్నాడు....ఇంకాసేపు అలాగే ఆ పొగ లో కూర్చోబెడితే 'నాకు ఈ పెళ్లి వొద్దు బాబోయ్!!' అని పారిపోతాడేమో అనిపించింది .నాకు నవ్వు,భయం ఒకేసారి వచ్చాయి ఆ ముఖం చూస్తే.....నేను వస్తుండడం చూసి ఇక వాళ్ళ బంధువులు చందు ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.....అయినా కూడా పోద్దున మెసేజ్ చేయలేదు అన్న కోపం తో కనీసం చూడను కూడా చూడలేదు నేను ....కానీ తరువాత కాశీ యాత్రకి బయలుదేరినపుడు దొంగ చాటుగా చూసాలెండి...
ఆ కార్యక్రమం అయ్యాక ఇంటికి వచ్చి కాసేపు నిద్రపోదామనుకున్నా....కానీ మళ్లీ ఆలోచనలు చుట్టు ముట్ట్టేసాయి....ఇంటినిండా సామాను..చుట్టాలు....పక్కాలు.....ఎవరి గోల వారిది లాగ ఉంది...నాకు మాత్రం మనసు మనసులో లేదు....రాత్రి నిద్ర లేదేమో అలాగే ఆలోచిస్తుంటే ఎప్పుడో కునుకు పట్టేసింది...
ఈలోగా సాయంత్రమైపోయింది....అసలు తతంగానికి తెర లేచింది....7 :51 కి ముహూర్తం...అమ్మ వచ్చి నన్ను లేపింది...టైం చూస్తే ఐదు...ఇక నాకు మంగళ స్నానం చేయించి ఎర్రని కంచిపట్టు చీర కట్టి,ప్రత్యేకంగా చేయించిన పూల జడ దగ్గరుండి కుట్టించి,కళ్యాణ తిలకం దిద్ది,చేతి నిండా గాజులు వేసి,రకరకాల నగలు పెట్టి,ఒక్కసారి నన్ను కళ్ళ నిండా చూసుకుని...'నేను నా కూతురు 'పెళ్లికూతురు' గా ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే ఉన్నావే...' అని దిష్టి తీసింది...... ఆ అలంకరణ అవన్నీ భలే గా అనిపించాయి.....ఎప్పుడూ సింపుల్ గా ఉండే నేను అన్ని నగలు అవి వేసుకోవడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది....సరిగ్గా ఆరున్నర కి నేను కళ్యాణ మండపానికి బయలుదేరాను ....ఒక్కసారి మళ్లీ నిస్సత్తువ ఆవరించింది....అదే నాకు ఆ ఇంటి మహారాణి గా ఆఖరి క్షణం...ఇక నేను వేరే ఇంటి అమ్మాయిని అయిపోతాను కదా!!.....వెళ్లబోయే ముందు అమ్మ-నాన్న కాళ్ళకి నమస్కరించాను.....నాన్న దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టారు.....అప్పుడు చూసాను నాన్న కళ్ళలో చిన్న నీటి తెర...నా జీవితం లో నాన్న ఏడవడం అదే మొదటిసారి నేను చూడటం ....ఇక అమ్మ అప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంది కాబోలు నన్ను దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుంది....ఇద్దరు నన్ను పొదివి పట్టుకుని బయటకు తీసుకెళ్ళారు...ఇంతలో తమ్ముడు వచ్చాడు..వాడు కార్ లో ముందు కూర్చోగా వెనుక అమ్మ-నాన్న మధ్యలో నేను కూర్చున్నా....కార్ బయలుదేరేముందు ఒక్కసారి ఇంటి వైపు చూసి ఇక చూడలేక తల తిప్పేసుకున్నా....
పెళ్లి మండపం....నేను,అమ్మ కలిసి ఆ అలంకరణ అన్నీ సెలెక్ట్ చేశాం...నాన్న గారికి ఆక్సిడెంట్ అవడం వల్ల అన్నీ మేమే చూసుకోవాల్సివచ్చింది....ఆ మండపం లోకి అమ్మ-నాన్న-తమ్ముడు తో పాటు అడుగు పెడుతూ...అందరూ అంతే చూస్తుంటే సిగ్గు తో తల దించుకుని వడి వడి గా పెళ్ళికూతురి గది వైపు వెళ్ళిపోయా...గౌరీ పూజ చేయడం పూర్తయ్యాక నన్ను బుట్టలో తీసుకెళ్ళారు పెళ్లి పీటల దగ్గరకి...ఇక అక్కడినించి పెళ్లి హడావిడి మొదలు....జీలకర్ర-బెల్లం,తాళి,తలంబ్రాలు,మెట్టెలు,నల్లపూసలు,ఏడు అడుగులు,హోమం,అరుంధతి నక్షత్రం ....అన్నీ పద్ధతి గా జరిగాయి... నేను చూసిన పెళ్ళిళ్ళలో నాకు బాగా నచ్చిన పెళ్లి మాదే......జీలకర్ర-బెల్లం పెట్టేటపుడు చందు చేయి మీద చేయి ఉంచి క్షణం నాకు ఇప్పటికీ మెదులుతూనే ఉంది....ఆ క్షణానే మనసులో అనుకున్నా...ఎప్పటికీ ఈ అబ్బాయి చేయి వదిలి పెట్టకూడదు అని......అలాగే తాళిబొట్టు కట్టేటపుడు....ఆ తాళి ఎప్పటికీ అలాగే పచ్చగా కళకళ లాడుతూ ఉండాలి అని కోరుకున్నా...ఇక తలంబ్రాలు అపుడు ప్రత్యేకంగా తెలుపు-ఎరుపు ముత్యాలు తెప్పించాం.....(రాముల వారి కల్యాణం చూసినపుడల్లా నాకు ముత్యాల తలంబ్రాలు కావాలనిపించేది..అందుకే వెతికి వెతికి మరీ అవి తెప్పించా)...అవి పోసుకుంటూ చేసిన గోల అంతా ఇంతా కాదు...సప్తపది అపుడు చందు అడుగులో అడుగు వేస్తుంటే ఎంత అబ్బురంగా అనిపించిందో !!..అలాగే మిగితా అన్ని కార్యక్రమాలు ఆహ్లాదంగా జరిగిపోయాయి.....బంధువులు,స్నేహితులు,చుట్టుపక్కలవాళ్ళు,నా చిన్ననాటి స్కూల్ టీచర్లు,...ఇలా చాలామంది దీవెనల మధ్య మా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది....
ఇక అప్పగింతలు దగ్గరికి వచేసరికి మళ్లీ పరిస్తితి మొదటికి వచ్చింది......అందరి దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ప్రతి ఒక్కరికి వీడ్కోలు చెప్పా!! అత్తయ్యలు,పిన్ని వాళ్ళు,ఆమ్మ వాళ్ళు,బాబాయ్,వరలక్ష్మి ఆంటీ వాళ్ళు,బామ్మ,కిరణ్ అన్నయ....అందరికీ....ఇక చివరికి చందు తో కలిసి మా అత్తగారింటికి వెళ్ళేటపుడు..... అమ్మ ని వదిలి మొదటిసారి అస్సలు పరిచయం లేని వారింటికి వెళుతున్నా అన్న భయం....దుఖం...సంతోషం....ఏమని చెప్పను....నా చందు దగ్గరకి వెళుతున్నా అని ఆనందమా!! అమ్మ ని,నాన్న ని వదిలేసి వెళ్ళిపోతున్నా అని బాధా!! అమ్మని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టా...అలాగే నాన్నకి కూడా...కూతురు అత్తవారింటికి వెళుతోంది అన్న ఆనందం....తమని వదిలి వెళ్ళిపోతోంది అన్న బాధ...పాపం వారి పరిస్తితి ఇంతే!!
ఇక అమ్మ-నాన్నకి,తమ్ముడికి 'బై' చెప్పేసి వెనుదిరిగి చూడకుండా కారేక్కేసా....తరువాత దారిపొడవునా ఏడుస్తూనే వున్నా!! చందు చాలా ఓదార్చాడు.... ఇక మర్నాడు తెలతెల వారుతుండగా అత్తవారింట్లో అడుగుపెట్టా....అలా అడుగు పెడుతునపుడు మనసులో ఒకటే అనుకున్నా....'ఇక ఇదే నా ఇల్లు....కష్టమైనా,సుఖమైన....ఇక ఇక్కడే నా జీవితం..' అని చందు తో కలిసి చిరునవ్వుతో....అడుగు పెట్టా!!
అలా జరిగిన సంవత్సరం తరువాత ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకోవాలనిపించింది....ఈ సంవత్సర కాలం అసలు ఎలా గడిచిందో కూడా తెలీదు... పెళ్ళికి ముందు అంత భయపడ్డ అమ్మయినేనా ఇన్ని వేలమైళ్ళు అమ్మావాళ్ళకి దూరంగా ఉన్నది??
కాలం అన్నిటికి మందు....కాలం గడిచే కొద్ది కొన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయ్...ఈ సంవత్సర కాలం...ఎన్నెన్నో ఊసులు....ఎన్నెన్నో జ్ఞాపకాలు...చిలిపి తగాదాలు....ఆనందాలు.....ఓదార్పులు....అలకలు...హ్మ్...అలా హాయిగా సాగిపోయాయి రోజులు..
ఎవరో బ్లాగ్ లో చెప్పినట్లు.... 'పెళ్లి అనేది జీవితం లో మనం జరుపుకునే పెద్ద పండుగ'... ఆ పండుగ విశేషాలని మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.... :)
మా పెళ్లిలో ని కొన్ని ముఖ్య ఘట్టాలు...ఫోటోల రూపంలో...
జీలకర్ర-బెల్లం:.
కన్యాదానం:
తలంబ్రాలు:
సప్తపది: